ఇంకా 28 రోజులు మాత్ర‌మే మిగిలాయి.. 'క‌న్న‌ప్ప'పై మంచు విష్ణు కౌంట్‌డౌన్ పోస్ట్

  • నాలుగో అంతస్తు పైనుంచి దూకి బలవన్మరణం
  •  మాజీ డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ దంపతుల వేధింపులే కారణమని ఆరోపణ
  •  ఫసియుద్దీన్, ఆయన భార్య, పీఏ సహా పలువురిపై కేసు నమోదు
  •  బోరబండలో ఉద్రిక్తత, ఫసియుద్దీన్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు
  •  సర్దార్ మృతదేహానికి ప్రజాప్రతినిధుల నివాళులు

హైదరాబాద్‌‌లోని బోరబండలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ సర్దార్ (33) బుధవారం రాత్రి తాను నివాసముంటున్న భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనతో బోరబండ ఎస్‌ఆర్‌టీ నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్, ఆయన భార్య హబీబాషేక్‌ల వేధింపుల కారణంగానే సర్దార్ ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.

ఎస్‌ఆర్‌టీ నగర్‌లో నివసించే ఎండీ సర్దార్ బుధవారం రాత్రి సమయంలో తన ఇంటి నాలుగో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సర్దార్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన తెలియగానే సర్దార్ బంధువులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ దంపతుల వేధింపులు భరించలేకనే సర్దార్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపిస్తూ బోరబండ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫసియుద్దీన్ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

మృతుడు సర్దార్ సోదరుడు ఎండీ ఇబ్రహీం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాబా ఫసియుద్దీన్, ఆయన భార్య హబీబాషేక్‌, ఫసియుద్దీన్ పీఏ సప్తగిరితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తన సోదరుడు సర్దార్ ఇటీవల ఇంటి ఆధునికీకరణ పనులు చేపట్టారని, ఈ క్రమంలో ఫసియుద్దీన్ దంపతులు డబ్బులు డిమాండ్ చేస్తూ తీవ్రంగా వేధించారని ఇబ్రహీం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వేధింపులు తట్టుకోలేకనే తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన ఆరోపించారు.

సర్దార్ మృతదేహాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి తదితర రాజకీయ ప్రముఖులు సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.