మంత్రి నారా లోకేష్ వాట్సప్ బ్లాక్ -ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ పంపాలని విజ్ఞప్తి.

BSR NEWS
మంత్రి నారా లోకేష్ వాట్సప్ బ్లాక్
- ప్రజలు తమ సమస్యలు తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి పంపాలని విజ్ఞప్తి.
- తానే స్వయంగా ఆ మెయిల్ చూసి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించిన మంత్రి.
సమస్య ఏదైనా, సహాయం కావాలన్నా ఇకనుంచి తనకు hello.lokesh@ap.gov.in ఈ మెయిల్ ఐడీకి పంపాలని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి తమ సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సప్ ను మెటా బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా అవిశ్రాంతంగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ వాట్సప్ బ్లాక్ కావడం, తరచూ ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటంతో తన పర్సనల్ మెయిల్ ఐడీ hello.lokesh@ap.gov.in కి ప్రజలు తమ వినతులు, సమస్యలు పంపించాలని ఒక ప్రకటనలో కోరారు. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని ఎన్నికలకు ముందే నారా లోకేష్ ప్రకటించారు. ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకునే ప్రజా దర్బార్ ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సప్కి వచ్చిన మెసేజ్ కు రియాక్ట్ అయ్యి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్య పరిష్కరించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్య తీసుకెళితే చాలు పరిష్కారం అయిపోతుందని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్కి వాట్సప్ చెయ్యడం వలన టెక్నికల్ సమస్యతో బ్లాక్ అయింది. తనకు సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడి
hello.lokesh@ap.gov.in కి సమస్యలన్నీ పంపించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
పాదయాత్రలో యువతకు తనను దగ్గరగా చేర్చిన "హలో లోకేష్" కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకున్న మంత్రి... తానే అందరి సమస్యలు నేరుగా అడ్రస్ చేస్తానని ప్రకటించారు. పేరు, ఊరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, సమస్య-సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు వినతులలో పొందుపరచాలని సూచించారు. మెయిల్ చేస్తే తాను స్పందిస్తానని తెలియజేశారు. వాట్సప్ తరచూ బ్లాక్ కావడంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండటం లేదని , దయచేసి అందరూ మెయిల్ ఐడీకే వినతులు పంపించాలని మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో విన్నవించారు.