Viral News: 25 ఏళ్ల క్రితం బంధువుల పెళ్లికి వెళ్లి తప్పిపోయిన మహిళ.. అంత్యక్రియలూ చేసేశారు.. కానీ బిగ్ ట్విస్ట్

- 25 ఏళ్లక్రితం కర్ణాటకలో తప్పిపోయిన సాకమ్మ అనే మహిళ
- హిమాచల్ప్రదేశ్లోని ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం
- ఇటీవల ఆ ఆశ్రమాన్ని సందర్శించిన ఓ యువ ఐపీఎస్ అధికారి
- సాకమ్మ కన్నడలో మాట్లాడుతుండడాన్ని గుర్తించి కర్ణాటక ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన అధికారి
- అడ్రస్ ట్రేస్ చేసిన ప్రభుత్వాధికారులు
- ఇవాళ సొంతం రాష్ట్రానికి చేరుకోనున్న సాకమ్మ
కర్ణాటకకు చెందిన సాకమ్మ అనే మహిళ 25 ఏళ్ల క్రితం తప్పిపోయింది. చాలా కాలం తర్వాత హిమాచల్ ప్రదేశ్లోని మండిలో ఆమె ఆచూకీ లభించింది. ఓ వృద్ధాశ్రమంలో ఆమె జీవనాన్ని వెళ్లదీస్తోంది.
బళ్లారిలోని దాననాయకనకెరె గ్రామానికి చెందిన సాకమ్మ తన పిల్లలతో కలిసి హోసపేటలో ఉన్న తన బంధువుల పెళ్లికి వెళ్లింది. అయితే, ఆమె ప్రమాదవశాత్తూ చండీగఢ్కు వెళ్లే రైలు ఎక్కింది. ఆ తర్వాత ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. తినడానికి తిండిలేక, ఒంటిమీద సరైన బట్టలేక చాలా కాలం తిరుగాడింది. ఆఖరికి హిమాచల్ప్రదేశ్లోని మండిలో ఉన్న ఓ వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది.
ఒక యువ ఐపీఎస్ అధికారి ఆ వృద్ధాశ్రమాన్ని సందర్శించడంతో సాకమ్మ కథ ఊహించని మలుపు తిరిగింది. ఆమె కన్నడ భాషలో మాట్లాడుతుండడాన్ని గుర్తించిన ఆ అధికారి... కర్ణాటక ప్రభుత్వ సాంఘిక సంక్షేమ శాఖను సంప్రదించారు. రంగంలోకి దిగిన అధికారులు ఆమె వివరాలు, అడ్రస్ను ట్రేస్ చేశారు. దీంతో ఇవాళే (బుధవారం) ఆమె తన కుటుంబం చెంతకు చేరబోతోంది. నేడు కర్ణాటక చేరుకోబోతోందని అధికారులు తెలిపారు.