చైనాలో బొద్దింకలు .. తేళ్లు ట్రై చేశాను: నటి కామాక్షి భాస్కర్ల!

చైనాలో బొద్దింకలు .. తేళ్లు ట్రై చేశాను: నటి కామాక్షి భాస్కర్ల!
  • డాక్టర్ కావాలనుకున్న కామాక్షి భాస్కర్ల 
  • నటన పట్ల ఆసక్తితో సినిమాల దిశగా అడుగులు
  • విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యత  
  • ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ

కామాక్షి భాస్కర్ల .. 'పొలిమేర' సినిమా నుంచి ఆమెకి మంచి గుర్తింపు వచ్చింది. మొదటి నుంచి కూడా బాగా చదువుకుని ఆమె డాక్టర్ అయ్యారు. అయితే ఈ లోగా సినిమాలపై పెంచుకుంటూ వచ్చిన ప్రేమ ఆమెను పూర్తిస్థాయిలో అటువైపు మళ్లించింది. ప్రస్తుతం ఆమె ఇటు వెబ్ సిరీస్ లతోను .. అటు సినిమాలతోను బిజీగా ఉన్నారు. తాజాగా ఐడ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. 

"మొదటి నుంచి కూడా నేను పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేదానిని. ఇల్లు - కాలేజ్ తప్ప నాకు మరేమీ తెలియదు. అలాంటి నేను 'చైనా'లో MBBS చేయాలనుకున్నాను. చైనాలో ఇంగ్లిష్ మాట్లాడరని కూడా నాకు తెలియదు. అంత అమాయకంగా నేను అక్కడికి వెళ్లిపోయాను. అక్కడికి వెళ్లిన తరువాత వాళ్ల భాషను అర్థం చేసుకోవడానికి .. నేర్చుకోవడానికి ప్రయత్నించాను" అని అన్నారు.

"చైనాలో 6 ఏళ్లపాటు ఉన్నాను. అక్కడివాళ్లు బొద్దింకలు .. కప్పలు .. పాములు .. తేళ్లు తింటారు. ఒకానొక సమయంలో అక్కడ గ్రీనరీ లేకపోవడం వలన వీటిని ఆహారంగా తీసుకోవడానికి వాళ్లు అలవాటు పడ్డారని నాకు తెలిసింది. నేను కూడా బొద్దింకలు .. తేళ్లు ట్రై చేశాను. టేస్టు విషయానికి వస్తే .. కాస్త డిఫరెంట్ గా అనిపించింది" అని చెప్పారు. ప్రస్తుతం తన చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు.