Free Current: తెలంగాణలో అద్దెకున్న వారికీ ‘గృహజ్యోతి’ పథకం

Free Current: తెలంగాణలో అద్దెకున్న వారికీ ‘గృహజ్యోతి’ పథకం
  • BSR NEWS
  • ఉచిత విద్యుత్ కు వారు కూడా అర్హులే
  • దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వివరణ
  • ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయని ప్రభుత్వం
  • తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకానికి అద్దెకుండే వారు కూడా అర్హులేనని, వారికి కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) వివరణ ఇచ్చింది. ఇంట్లో అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంపై డిస్కం స్పందించింది. ఆ వార్తలేవీ నిజం కాదని పేర్కొంది. గత నెలలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ పథకానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదు.

    దీంతో ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులనే విషయంపై స్పష్టత కొరవడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై డిస్కం కొంత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని తెలిపింది. రాష్ట్రంలో 1.31 కోట్ల ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. ఉచిత విద్యుత్ పథకానికి 82 లక్షల దరఖాస్తులు వచ్చాయని అధికారులు వెల్లడించారు. గతేడాది నెలకు 200 యూనిట్ల వరకు వాడుకున్న ఇళ్లు ఎన్ని అని లెక్కలు కడుతున్నట్లు చెప్పారు. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైతే అర్హులు ఎవరు, రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది ఉంటారనే అంశంపై క్లారిటీ వస్తుందని అధికారులు వివరించారు.